Banswada News
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి
Quick Summary:
బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో పోస్టర్ల ఆవిష్కరణ.
5టీవీ న్యూస్ బాన్సువాడ : రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని రేణుక ఒకేషనల్ కళాశాలలో బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో ఫీజు బకాయి బీజేపీ లడాయి పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొనాల గంగారెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. రాష్ట్రంలో సుమారు రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు ఈ పథకాలపై ఆధారపడి ఉన్నారని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెండింగ్ బకాయిలన్నింటినీ విడుదల చేస్తామని, ప్రతి సంవత్సరం లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. స్కాలర్షిప్లు అందక అనేక మంది విద్యార్థులు చదువులు మధ్యలోనే నిలిపివేస్తున్నారని, ఉద్యోగాల భర్తీ లేక యువత ఇబ్బందులు పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇంజినీరింగ్ విద్యార్థులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని, అలాగే పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేసి ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శులు చిరంజీవి, ఉమేష్, బీజేపీ నాయకులు భాషా, భాస్కర్ రెడ్డి, చీకట రాజు, అశ్విన్, పురుషోత్తం, సచిన్, నరేష్, పద్మ, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
